హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ను గత అక్టోబర్లో సీబీఐ కోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సబితా హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలతో తనకు సంబంధం లేదని, ఆ కేసులో తన పేరు తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేసు దర్యాప్తులో కొత్త విషయాలు ఏమీ తేలకపోయినా తనను నిందితురాలిగా సీబీఐ చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు.
చార్జిషీట్, అదనపు చార్జిషీట్లలో తన పేరు కూడా లేదని తెలిపారు. సాక్షులు మినహా అదనపు సమాచారం లేకపోయినా నిందితురాలిగా చేర్చడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. గనుల కేటాయింపు వ్యవహారంలో సీబీఐ కానీ, సీబీఐ కోర్టు కానీ తన పాత్ర ఉన్నట్టు నిర్ధారణ చేయలేదని పేర్కొన్నారు.
ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పుడు.. సబిత ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఏపీలోని అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని గనులను గాలి జనార్దన్రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల లీజుల కేటాయింపులు జరిగాయి. సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితురాలిగా చేర్చడాన్ని కొట్టేయాలనే ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ జరపనున్నారు.