నాగర్కర్నూల్ : కలలు కనండి.. బాగా చదివి కన్న కలలను సాకారం చేసుకోండని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలు, తాము కన్న కలలను నెరవేర్చుకునే విధంగా చదవాలి. అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
శుక్రవారం జిల్లాలోని కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం కింద గ్రామంలోని పాఠశాలలకు దాదాపు 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పాఠశాలల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మార్చాల గ్రామంలో సుమారు రూ.6 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 7,390 కోట్లతో మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మన ఉరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలి. ఏ కళాశాలలో ఏ కోర్సులు ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఏ విధంగా పొందవచ్చు అనే పూర్తి వివరాలు తెలిపే కెరీర్ గైడ్ పోర్టల్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.
మార్చాల గ్రామంలో వృత్తి విద్యా కోర్సుపెట్టాలని గ్రామస్తులు కోరగా అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, అదనపు కలెక్టర్ మను చౌదరి, ఎంపీపీ మనోహర, జడ్పీటీసీ భరత్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, తదితరులు పాల్గొన్నారు.