రంగారెడ్డి : స్వచ్ఛతకు నిలయాలుగా తెలంగాణ పల్లెలు మారాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని షాబాద్ మండలం సర్దార్ నగర్లో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అవడంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి చేస్తున్నారు.
దేశంలో నిర్వహించిన సర్వేలో పదికి పది, 20 లో 19 ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణవే. అందులో ఒకటి మాత్రం గుజరాత్ రాష్ట్రానికి వెళ్లిందన్నారు. ఇదే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 9 కోట్ల 8 లక్షల రూపాయలు పల్లె ప్రగతి కింద విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో రూ.335 కోట్ల నిధులు ఈ కార్యక్రమం కింద మంజూరయ్యాయి.
ఏ గ్రామానికి వెళ్లినా క్రీడా ప్రాంగణం ఉండాలని తెలంగాణ గ్రామీణ క్రీడల ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, అంతర్గత సీసీ రోడ్లు, పచ్చదనం, పరిశుభత్ర వంటి కార్యక్రమాలతో పల్లెలు మెరిసిపోతున్నాయన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శం అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఏడు వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి ,చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీటీసీ అవినాష్ రెడ్డి,ఎంపీపీ ప్రశాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.