హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన డాక్టర్ శ్రీజను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. సివిల్ సర్వీసెస్ కు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్లనున్న ఆమె సోమవారం బషీర్ బాగ్లోని కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీజను మంత్రి అభినందించి, భవిష్యత్తులో మరింత రాణించాలన్నారు. శిక్షణలో మంచి ప్రతిభ చూపి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, పుట్టిన గడ్డ పేరు నిలబెట్టాలన్నారు. దేశంలోనే 20వ ర్యాంక్ సాధించటం ఎంతో గొప్ప విషయమని, యువతరానికి శ్రీజ విజయం ప్రేరణ ఇస్తుందని మంత్రి సబితా రెడ్డి అభిప్రాయ పడ్డారు.
ఉస్మానియా దవాఖానలో డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తూనే దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్కు ఎంపికైన శ్రీజ నగరంలో ని ఉప్పల్లోని చిలుకనగర్లో నివాసం ఉంటున్నారు.