బీబీనగర్, ఆగస్టు 3: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారైలు ప్రభుత్వ బడులను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జీసీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నారై గూడూరు మహేందర్రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థంగా రూ.42 లక్షలతో నిర్మించిన డిజిటల్ గ్రంథాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఏ నర్సిరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నారైలు తమ ఊరి ప్రభుత్వ బడుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అంతకుముందు బీబీనగర్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారంగా అందించే రాగి మాల్ట్ను మంత్రి పంపిణీ చేశారు.