ఖమ్మం, నవంబర్ 27: ఖమ్మం ప్రజలు ఆపదలో ఉన్న వేళ తానే అండగా ఉన్నానని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) స్పష్టం చేశారు. చివరికి ఖమ్మంలో వర్షాలు వచ్చినా, మున్నేటి వరదలు వచ్చినా తానే ఎదురెళ్లి నగర ప్రజలను ఒడ్డుకుచేర్చానని గుర్తుచేశారు. ఖమ్మం నగరంలో సోమవారం పర్యటించిన ఆయన.. 43, 46, 48 డివిజన్లలో రోడ్షోలలో( Road show )మాట్లాడారు. మరి ఎన్నో గొప్ప పనులు చేశానంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల.. ఖమ్మం ప్రజలు కష్టాల్లో ఉన్న వేళ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
కరోనా వేళ సాయమందించారో, వరదల వేళ వచ్చి బురదలో దిగి భుజం అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు ఖమ్మం భవిష్యత్కి సంబంధించిన ఎన్నికలని అన్నారు. వాటి ఫలితాలు మన తలరాతను నిర్దేశిస్తాయని అన్నారు. అందుకని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో ఖమ్మాన్ని తీర్చిదిద్దానని అన్నారు. ఖమ్మం అభివృద్ధి గురించి మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కూడా చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పారని గుర్తుచేశారు.
ఖమ్మం మూడో పట్టణాన్ని మున్నేరు వరదలు చుట్టిముట్టిన వేళ అర్ధరాత్రిన వెళ్లి ప్రజలను కాపాడుకున్నానని అన్నారు. అంతటితోనే ఆగిపోకుండా విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రిటైనింగ్ వాల్ మంజూరు చేయించానని గుర్తుచేశారు. గతంలో గొంగళిపురుగులా ఉన్న ఖమ్మం నగరాన్ని తాను నేడు సీతాకోకచిలుకలా తీర్చిదిద్దానని గుర్తుచేశారు. ఎక్కడా దిక్కులేక ఇప్పుడు ఖమ్మమొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల.. ఈ అభివృద్ధి అతనే చేసినట్లుగా చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నియోజకవర్గ మరింత అభివృద్ధి కోసం మరోసారి తనను దీవించి గెలిపించాలని కోరారు.