ఖమ్మం : దళితులు ఆర్థింకాగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశేపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ, కోదుమూరు గ్రామంలో లబ్ధిదారులకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, ట్రాలీ జీప్ లు తదితర యూనిట్స్ ను మంత్రి పంపిణి చేశారు.
తొలుత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. హార్వెస్టర్ ను నడిపి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. చింతకాని మండలంలో దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయడం చారిత్రాత్మకం అన్నారు. కేవలం రెండు నెలల కాలంలో పథకం అమలుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఎంతో కృషి చేసిన ఆధికారులను మంత్రి పువ్వాడ అభినందించారు.
దళితులు కూలీల స్థాయి నుంచి యజమానులుగా నిలిచి మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ప్రయోగాత్మంగా ముందుగా నియోజకవర్గానికి 100 చొప్పున దళిత బందు అమలు చేశామని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.
ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, విత్తనభివృద్ధి సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాస రావు, జెడ్పీ సీఈవో అప్పారావు , ఆర్డీవో రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.