హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్లు అద్దంలా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో ఆదేశించారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గత రెండు సీజన్లలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మేల్యేలను సమన్వయం చేసుకొని వారు ప్రతిపాదించిన రోడ్లు పరిగణనలోకి తీసుకొని బాగు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా PR(పీరియాడికల్ రెన్యువల్), FDR(ఫ్లడ్ డ్యామేజ్ రోడ్స్) కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 2,500 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ నెల 15 లోపు వర్క్ అగ్రిమెంట్స్ పూర్తయి పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారం వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు వేగంగా నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రోడ్లు భవనాలు శాఖ సెక్రెటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు పలువురు ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.