Telangana Roads | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్లు( R and B Roads ) అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి( Minister Prashanth Reddy ) అన్నారు. శుక్రవారం ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సీ రవీందర్ రావు, ఇతర ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1170 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం రూ. 2,875 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. అందులో సుమారు రూ. 570 కోట్లతో 232 పనులు ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏజెన్సీలు పనులు చేపట్టాయని, ప్రతీ ఏజెన్సీ వారానికి కనీసం ఒక పని పూర్తి చేయాలని ఆదేశించారు. కావున పురోగతిలో ఉన్న మిగతా 938 పనులను వారానికి 60 చొప్పున నెలలో 240 పనులు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకొని పని చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. ప్రణాళిక ప్రకారం మూడున్నర నుంచి నాలుగు నెలల్లోపు అంటే జూన్ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతీవారం తానే స్వయంగా రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని మంత్రి అధికారులతో అన్నారు.