హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, నూతన సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్ అండ్ బి కార్యాలయంలో అమరుల స్మారక చిహ్నం, నూతన సెక్రటేరియట్ నిర్మాణ పురోగతిపై అధికారులు, వర్క్ ఏజెన్సీ, కన్సల్టెన్సీ, ఆర్కిటెక్ట్ లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. వర్క్ చార్ట్ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. ఫ్లోర్ వైస్ అంతర్గత నిర్మణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జరగాలని సూచించారు.
అమరవీరుల స్మారక చిహ్నం మీద నిరంతరం జ్వలించే జ్వాలలో అమరుల త్యాగం ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్లోర్ వైస్ డిజైన్ ప్లాన్స్ పరిశీలించారు. ఎంట్రన్స్ లో స్మారక చిహ్నం బిల్డింగ్ లో ప్రవేశించే ముందు చిన్నారులతో అమరులకు నివాళులు అర్పిపిస్తున్నటు డిజైన్, ల్యాండ్ స్కేప్, ఆడియో-వీడియో విజువల్ రూమ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు రూపొందించిన ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి తెలుసుకున్నారు. అమరుల త్యాగాలను కళ్లకు కట్టినట్టు చూపించే ఫోటో ఎగ్జిబిషన్, ఒక కాన్ఫరెన్స్ హాల్, రెస్టారెంట్ ప్లాన్స్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల ప్రకారం స్వల్ప మార్పులు మంత్రి సూచించారు. అమరుల త్యాగానికి ప్రతీకగా, భావి తరాలకు ఆదర్శంగా నిలిచే ఈ కట్టడం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
సెక్రటేరియట్ నిర్మాణ పనులపట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా వేగం పెంచాలన్నారు. ఫ్లోర్ వైస్ ప్లాన్స్ ఈ సందర్భంగా పరిశీలించారు. మినిస్టర్ ఛాంబర్, ఆఫీసర్ ఛాంబర్స్, డిపార్ట్మెంట్ వైస్ సెక్షన్స్ ఛాంబర్స్ అంతర్గత నిర్మాణాలపై కూలంకషంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే చెప్పినట్లు స్వల్ప మార్పులతో ఫైనల్ ప్లాన్స్ వీలైనంత త్వరలో సమర్పించాలని ఆదేశించారు. పనుల తీరుపై ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజన్సీ ప్రతినిధులను ఆరా తీశారు. బ్లాక్ వైస్ గా స్లాబ్ నిర్మణాలు, వర్క్ చార్ట్ ప్రకారం జరిగే పనులు మంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పనులు తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈలు పద్మనాభ రావు, లింగారెడ్డి, సత్యనారాయణ, ఈఈలు శశిధర్, నర్సింగరావు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని, పలువురు కన్సల్టెన్సీ, వర్క్ ఏజన్సీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.