హైదరాబాద్ : ప్రతి పేద వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేద ప్రజల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి, అర్హులైన పేదలకు పంపిణీ చేశారు.
అయితే ఈ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో మినిస్టర్ క్వార్టర్స్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పథకంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,91,057 ఇండ్లను రూ. 19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో 2,28,529 ఇండ్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. నిర్మాణం ప్రారంభించిన 2,28,529 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను 1,29,528 గృహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. మిగతా 58,350 గృహాల నిర్మాణం తుది దశలో ఉన్నదని తెలిపారు. మిగతా 40,651 డబుల్ బెడ్రూం ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు.
నిర్మాణం పూర్తయినా, తుది దశలో ఉన్న ఇండ్లకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.