శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఒక గ్రామం వంద శాతం టీకాలు వేసిన తొలి గ్రామంగా రికార్డుకెక్కింది. కతువా జిల్లాలోని బొబియా గ్రామం ఈ ఘనత సాధించింది. బొబియా గ్రామంలోని ప్రజలంతా కరోనా టీకాలు తీసుకున్నారని హిరానగర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ స్వామి శరణ్ తెలిపారు. 45 ఏండ్లు పైబడిన ప్రజలతోపాటు 18 ఏండ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేసినట్లు చెప్పారు. గ్రామంలోని రెండు ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడంతోపాటు ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేసినట్లు వెల్లడించారు. దీంతో వంద శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తి చేసిన గ్రామంగా బొబియా నిలిచిందని వైద్య అధికారి స్వామి శరణ్ వివరించారు.