హైదరాబాద్: రవాణా వ్యవస్థను అతి త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ఆర్టీసీ (RTC) కనెక్టివిటీని పెంచుతామన్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీభవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రవాణా శాఖమంత్రిగా తొలి కార్యక్రమం తనతో ప్రాంభమవుతున్నదని వెల్లడించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తరువాత ఉచిత బస్సు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ఆరంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 33 జిల్లాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందని తెలిపారు.
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించగా, శ్రీధర్బాబుకు ఐటీ, పరిశ్రమల శాఖ కేటాయించారు. మరో సీనియర్ నేత అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ అప్పగించారు. ఇక హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి తనవద్దే ఉంచుకున్నారు.
మంత్రులు- శాఖలు
భట్టివిక్రమార్క- ఆర్థిక, విద్యుత్ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి- నీటిపారుదల, పౌరసరఫరాలు
శ్రీధర్బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
దామోదర రాజనర్సింహ- వైద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి- రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత శాఖ
జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, పర్యాటక శాఖ
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ
పొన్నం ప్రభాకర్- రవాణా, బీసీ సంక్షేమం
సీతక్క- మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్
కొండా సురేఖ- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ