హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): దావోస్ పర్యటన విజయవంతం కావడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతోపాటు పెట్టుబడి అవకాశాలను చాటేందుకు డబ్ల్యూఈఎఫ్ వేదిక ఎంతో ఉపయోగపడిందని, పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా నిలిపిందని పేర్కొన్నారు. ఉత్తమ విధాన రూపకర్తలు, బిజినెస్ లీడర్లు, ఆలోచనాపరులను ఒకే చోటికి తీసుకొచ్చిన ఈ వేదిక ద్వారా రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తన పర్యటన విజయవంతం కావడానికి కృషిచేసిన ప్రభుత్వ అధికారులకు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులకు, బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని ఎన్నారైలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జయేశ్ రంజన్ నేతృత్వంలోని బృందం గొప్పగా పని చేసిందని ప్రశంసించారు. ఈ పర్యటనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. ‘దావోస్ క్యాండిడ్ పిక్స్లో ఇది ఒకటి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీజీ, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్జీతో కలిసి ఇండియా పెవిలియన్లో డిన్నర్.. పిక్చర్ పర్ఫెక్ట్ వాతావరణంలో జ్యూరిచ్లో వీధి పక్కన కూర్చొని భోజనం.. కుడోస్ దావోస్.. టిల్ నెక్ట్స్ టైం (మళ్లీ వచ్చే వరకు గుడ్బై దావోస్)’ అంటూ ఆ ఫొటోలతో ట్వీట్ చేశారు.