వరంగల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీరు మరోసారి బయటపడ్డది. కేంద్రప్రభుత్వ పథకాల కింద పని చేసే వారికి వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రి బీఎల్ వర్మను సిబ్బంది అడిగితే సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నారు. హనుమకొండలోని వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఈ చోద్యం జరిగింది. బీజేపీ లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహకార, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి బీఎల్వర్మ వరంగల్ లోక్సభ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఆయన వరంగల్లోని వడ్డ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వచ్చారు.ఈ సందర్భంగా ‘కేంద్ర పథకాల పరిధిలో పని చేస్తున్నాం. మా వేతనం రూ.13 వేలు. ఏఎన్ఎంలకు, ఆశలకు సూపర్వైజర్గా అన్ని పనులు చేస్తున్నాం. మా వేతనం సరిపోతలేదు. పెంచాలని కోరుతున్నాం. వీలైతే రూ.30 వేలకు పెంచండి సార్. ఆశ కార్యకర్తలకు రూ.9 వేలు ఉంది. వీరికీ పెంచాలి’ అని కమ్యూనిటీ ఆర్గనైజర్ టీ మంగ.. కేంద్రమంత్రిని కోరారు. ‘మాకు వేతనాలు పెంచాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం రూ.9,750 ఇస్తున్నది. రాష్ట్ర సర్కారు లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి’ అని ఆశ కార్యకర్త లత విజ్ఞప్తిచేశారు. వీరిద్దరూ చెప్పిన విషయాలను పక్కనే ఉన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి హిందీలో కేంద్ర మంత్రి వర్మకు వివరించారు. మొత్తం వివరాలు విన్న కేంద్రమంత్రి వర్మ ఏమీ తెలియనట్టు వ్యవహరించారు. సిబ్బంది మరోసారి చెప్పడంతో ‘మీ సలహా విన్నాం’ అన్నారు. ‘రాత పూర్వకంగా ఇస్తే ప్రయత్నిస్తాం’ అని వైద్య సిబ్బందికి ఉచిత సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆద్యంతం బీజేపీ కార్యక్రమంలా..
కేంద్ర మంత్రి అధికార పర్యటన పూర్తిగా బీజేపీ కార్యక్రమంలో సాగింది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించే సమయంలో మంత్రి వెంట పూర్తిగా బీజేపీ నేతలు, కార్యకర్తలే ఉన్నారు. కేంద్ర మంత్రి వర్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగానే వైద్య సిబ్బందిని వెనక్కి నెట్టి మరీ బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. బూస్టర్ డోసు వేసుకునే వ్యక్తి పక్కన ఉండి ఫొటో దిగారు.