పాలకుర్తి , నవంబర్ 7: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి క్షీరగిరి క్షేత్రంపై అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలిగి 35 గ్రామాల ప్రజలకు దర్శనమిచ్చింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అఖండ జ్యోతిని వెలిగించారు.
మంత్రి సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు, ఉత్తర కాశీ పీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్ఞానందసరస్వతితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.100 కోట్లతో పాలకుర్తిని అభివృద్ధి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చారని చెప్పారు.