వనపర్తి : జిల్లా పరిధిలోని అమ్మాయిపల్లి నుంచి బెక్కెం గ్రామానికి వెళ్తున్న వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి.. ఓ వృషభానికి నామకరణం చేశారు. బెక్కెం గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవానికి మంత్రి వెళ్తుండగా.. పెద్దదగడ గ్రామంలో రహదారిపై రైతు గోపాలకృష్ణ తన ఎద్దుతో నిలిచి ఉన్నాడు. ఎద్దును గమనించిన మంత్రి తక్షణమే తన వాహనాన్ని ఆపారు. వాహనం దిగిన మంత్రి నిరంజన్ రెడ్డి.. ఆ వృషభం వద్దకు వెళ్లి తలను నిమిరారు. దీనికి ఏం పేరు పెట్టావు అని రైతును మంత్రి అడగ్గా.. ఇంకా ఏం పేరు పెట్టలేదని అతను చెప్పాడు. మీరే ఏదో ఒక పేరు పెట్టండని రైతు మంత్రిని కోరగా.. ఆ వృషభానికి లవన్న అని నామకరణం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి వెంట ఎంపీ రాములు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు.