వనపర్తి : స్వాతంత్య్ర స్ఫూర్తిని అందరికీ తెలిపేలా వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లతో వజ్రోత్సవ వేడుకలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం లభించిందని, ఈ దేశంలో అందరూ రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. ప్రపంచంలోని పలు దేశాలు మనిషి స్వేచ్ఛ, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75 సంవత్సరాల నేపథ్యంలో ప్రభుత్వం ద్విసప్తాహ వేడుకలు నిర్వహిస్తుందన్నారు. 8న హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ నాయకత్వాన సమావేశం జరుగనున్నదారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువత, మహిళలు, వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలన్నారు.
నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల కలెక్టర్లు ప్రతిష్టాత్మకంగా పని చేయాలన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంపై ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్కు మంత్రి నివాళులర్పించారు. క్యాంప్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను కొనియాడారు.