హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో నగదు జమలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 60,16,697 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. మిగిలిపోయిన రైతులకు ఒకట్రెండు రోజుల్లో నిధులు జమ అవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
పంటలకు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.50 వేల కోట్లకు చేరుకోవడంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఊరూరా రైతుబంధు సంబురాలు నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలు నిర్వహించి కృతజ్ఞతలు చాటుకొన్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అనేక ప్రాంతాల్లో చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వరి నారుతో సీఎం కేసీఆర్, రైతుబంధు చిత్రపటాలను రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గుల పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
రంగు రంగుల రంగవల్లులు, ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు, గొబ్బెమ్మలు, చెరుకు గడల ప్రదర్శనలతో సందడి చేశారు. ఘనంగా జరిగిన రైతుబంధు సంబురాలతో గ్రామాల్లో సంక్రాంతి పండుగ శోభ ముందే వచ్చిందన్న టాక్ వినిపించింది. ఖమ్మం హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్వాహకులు, వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు మార్కెట్లో 50 క్వింటాళ్ల కూరగాయలతో 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటం సంబురాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ రంగులతో రూపొందించిన సీఎం కేసీఆర్ చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంగిరెద్దుల ఆటలు, ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు, చెరుకు గడల ప్రదర్శన సంక్రాంతి పండుగ సందడిని తలపించింది. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొనడంతో ఉత్సవాలకు మరింత నిండుదనం వచ్చింది.