హైదరాబాద్: దేశంలో పంటల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలైందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన పద్ధతులను అనుసరించడం ప్రారంభించారని తెలిపారు. మనవాళికి, జీవరాశికి అవసరమైన ఆహారమంతా ఈ భూమి నుంచి ఉత్పత్తికావాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా ఆవశ్యకతపై జరిగిన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడిన రమేష్ రాలియా నానో యూరియాను కనుగొన్నారని, భారత రైతాంగం శ్రేయస్సు కోసం నానో యూరియా టెక్నాలజీని ఇఫ్కోకు అందించారని చెప్పారు. నానో టెక్నాలజీతో తొలిసారిగా యూరియాను ద్రవరూపంలో తీసుకొచ్చారని వెల్లడించారు. దీంతో ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని తెలిపారు. ప్రపంచ వ్యసాయానికి నానో యూరియా ఆదర్శమన్నారు.
పంటలు పండటానికి ప్రధానంగా భూమిలో పోషకాలు అవసరమని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయని మంత్రి అన్నారు. రసాయన ఎరువుల వాడకంలో గత ప్రభుత్వాలు రైతులకు సరైన పరిజ్ఞానం కల్పించకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు వాడారని, దీంతో భూమిలో పోషకాలు లోపించడం, అధికం కావడం వంటివి జరిగాయని చెప్పారు. భూమికి అవసరమైన పోషకాలు ఏమిటి, ఎంత వాడాలి అనేదానిపై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
దేశంలో వినియోగించే 70 శాతం యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు.
అత్యధిక ఎరువులు, యూరియా వాడకం మూలంగా చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి అనేక దుష్పరిణామాలను అరికట్టడం, రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
దేశంలో వివిధ రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా యూరియాను మోతాదుకు మించి వాడుతున్నామని, ఈ నేపథ్యంలోనే రైతులను నానో యూరియా వైపు రైతులను మళ్లించాలని నిర్ణయించామన్నారు. ట్రేడర్లు, వ్యాపారులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులను ఈ దిశగా మళ్లించేందుకు సహకరించాలిని కోరారు. నానో యూరియా వాడకం వల్ల మొక్కలకు పత్రహరితం ఎక్కువగా అంది పంట వేగంగా ఎదుగుతుందని వెల్లడించారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానమని పేర్కొన్నారు. యూరియా 30 నుంచి 50 శాతం మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుందని,
నానో యూరియా 80 శాతం వరకు పనిచేసి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.