నిర్మల్/మంచిర్యాల/ఆర్మూర్, మే 2 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎదురుచూడకుండా, ప్రైవేటు వ్యాపారులు పంట చేలకు వచ్చి కొనేలా ఉత్పత్తులు ఉండాలని పిలుపునిచ్చారు. నిర్మల్లోని అంబేద్కర్భవన్లో, మంచిర్యాలలో నిర్వహించిన వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ల వర్క్షాప్ పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్లో ఆయిల్పామ్ నర్సరీని సైతం మంత్రి సోమవారం పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు, కింది స్థాయి సిబ్బంది రైతులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి కొత్త పంటలను సాగుపై అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ పత్తికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నదని, ఆ దిశగా రైతులు ముందుకు సాగాలని సూచించారు. అలాగే ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాల్లో తోటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. ఆయిల్ పామ్కు ఏ పంటకు లేనంతగా డిమాండ్ ఉన్నదని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 55 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని అధికారులు పెట్టుకున్నట్టు చెప్పారు.
ఇప్పటివరకు 4,065 ఎకరాల్లో 1,333 మంది రైతులు ఆ పంట సాగుకు ముందుకొచ్చినట్టు మంత్రి వివరించారు. మరో 435 మంది రైతులు 1,540 ఎకరాల్లో ఆయిల్పామ్ను డ్రిప్ ద్వారా సాగుకు ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టు చెప్పారు. కార్యక్రమాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్రావు, ఉద్యానవనశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.