హైదరాబాద్: నకిలీ విత్తనాలు అమ్మినట్టు తేలితే పీడీ యాక్ట్ నమోదుచేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలపై స్పెషల్ టాస్క్పోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆయిల్పామ్ సాగుకు తెలంగాణ నేలలు అనువుగా ఉంటాయని చెప్పారు. అయితే ఆయిల్పామ్ విత్తనం మొలవాలంటే చాల సమయం పడుతుందన్నారు. దీంతో ఆ విత్తనాల కోసం అనేక దేశాల నుంచి డిమాండ్ ఉందని తెలిపారు. విత్తనాల కోసం ఎవరు అప్లయ్ చేసుకున్నా సబ్సిడీలు ఇస్తున్నామని చెప్పారు.
నర్సరీల క్వాలిటీని హార్టికల్చర్ శాఖ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుందని మంత్రి అన్నారు. నూనె ఉత్పత్తిలో వేరుశనగలది కీలకపాత్ర అని తెలిపారు. ఉమ్మడి పాలమూరులో పండే శనగలు నాణ్యమైనవని ఇక్రిశాట్ వాళ్లే చెప్పారని గుర్తుచేశారు. వేరుశనగ పరిశోధనా కేంద్రాన్ని వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.