వనపర్తి: మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పల్లెనిద్రలో భాగంగా వనపర్తి మండలం పెద్దగూడెం తండాలో మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు పరిశీలించారు. బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు.
దశలవారీగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, మౌలిక వసతులను ఏర్పాటుచేసేందుకే ఈ పథకాన్ని రూపొందించామన్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.7,289 కోట్లు ఖర్చుచేయనున్నదని తెలిపారు. మొదటి దశలో రూ.3,497.62 కోట్లు కేటాయించామన్నారు.