వనపర్తి : రాబోయే వందేళ్లకు సాగు, తాగు నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. పునర్నిర్మాణం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. 60 ఏళ్లలో ఎదుర్కొన్న అవస్థలు తొలగించేందుకు పునర్నిర్మాణం చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. బీ ఫామ్ అందుకున్న నేపథ్యంలో సోమవారం ఖిల్లా ఘణపురం మండలం గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజల ప్రధానమైన సమస్యలను తీర్చుకుంటూ వచ్చాం. ఒకప్పుడు తాగునీళ్ల కోసం బోర్లు, బావులు, బోరింగుల చుట్టూ తిరిగిన దుస్థితి ఉండేదని, ఆ సమస్యను పూర్తిగా రూపుమాపామని ఆయన పేర్కొన్నారు. నీటి సమస్యను తొలగించేందుకు ఇంటింటికి నల్లా నీళ్లు తెచ్చాం. దీక్షగా పనిచేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీటి కష్టాలను తీర్చామన్నారు. కాల్వలు లైనింగ్ చేసి సాగునీటి వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజల కళ్ల ముందున్నది. ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషిచేయాలన్నారు.