వనపర్తి : వనపర్తి జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్రంలోనే ఈ జిల్లా భూగర్భ జల లభ్యతలో మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయ రంగాల అభివృద్ధిలో వనపర్తి జిల్లా చాలా ముందంజలో ఉందని తెలిపారు. గత వానాకాలం సీజన్లలో వర్షపాతం అధికంగా నమోదైందని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి లెఫ్ట్ కెనాల్ -2, 3 కింద 52 వేల ఎకరాల ఆయకట్టు సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని ఆయన వివరించారు. గోపాల్పేట, ఘనపూర్లలో 37 కిలో మీటర్ల మేర నీటి వనరులు వున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ అడ్వైజర్ విజయ్ ప్రకాష్, చీఫ్ ఇంజనీర్లు(సీఈ) హమీద్ ఖాన్, రఘునాథ్ రావు, ఎస్ఈటీ సత్యశిల రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) మధుసూదన్, అధికారులు, నీటి పారుదల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.