రవీంద్రభారతి, మే 19: దివంగత సీఎం ఎన్టీఆర్ కారణజన్ముడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వెండితెరపై వెలుగు వెలిగిన ఎన్టీఆర్, కృష్ణ, దాసరి నారాయణరావు సినిమా రంగానికి చేసిన సేవలు స్థిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని ప్రధాన కళామందిరంలో నిర్వహించిన ఎన్టీఆర్, కృష్ణ, దాసరి నారాయణరావు జయంతి వేడుకలను పురస్కరించుకొని ‘సీల్వెల్ సినీ సుస్వరాలు-36’, ఎన్టీఆర్ శ్రమశక్తి పురస్కారాల ప్రదానోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా నిరంజన్రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారం-2023ను ప్రదానం చేశారు. సినీ హీరో తల్వార్ సుమన్కు హీరో కృష్ణ -2023, సినీ దర్శకుడు బొమ్మాకు మురళికి డాక్టర్ దాసరి నారాయణరావు పురస్కారం, డాక్టర్ తాటికొండ పట్టాభికి ఎన్టీఆర్ శ్రమశక్తి పురస్కారాలను అందజేశారు. నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, ఎన్టీఆర్ సినీరంగంలోనేగాక రాజకీయాల్లోనూ రాణించి, తనలాంటివారికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. పురస్కారాలు అందుకొన్నవారికి అభినందనలు తెలిపారు. సీల్వెల్ సీఎండీ బండారు సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ బీ భీంరెడ్డి, కోలేటి దామోదర్గుప్తా, నవరస గాయని ఆమని, శ్రీనివాస్గౌడ్, దైవజ్ఞశర్మ, సుభాష్, రాజన్, రామకృష్ణ, డాక్టర్ మహ్మద్ రఫీ, కుసుమ బోగరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.