హైదరాబాద్ : వ్యవసాయం సుస్థిరం కావాలంటే నాణ్యమైన విత్తనమే ప్రధానమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నగరంలోని నోవాటెల్లో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పథం మారాలని, ప్రపంచానికి అవసరమైన ఆహారం రావాల్సింది వ్యవసాయం నుంచేనని స్పష్టం చేశారు.
వివిధ పంట రకాలను విస్తరించేందుకు పరిశోధనలు ముఖ్యమని, దేశంలో దాదాపు 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అనేక ప్రైవేటు పరిశోధనా ఉన్నాయన్నారు. ప్రస్తుతం వాటిలో పరిశోధనలు జరుగుతున్నా.. అవి మరింత సమన్వయంతో జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విత్తన పరిశోధన ప్రైవేటు రంగంలో ఎక్కువగా ఉన్నదని, ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు కనుక ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహారం అందించడం ప్రథమ కర్తవ్యమన్నారు. దీంతో పాటు నాణ్యమైన పోషకాహారంపై దృష్టి పెట్టాలన్నారు.
2015లో జరిగిన ఐక్యరాజ్య సమితి జెనీవా సదస్సు 17 అంశాలను ప్రపంచం ముందు ఉంచి, వాటిపై దృష్టి పెట్టాలని సూచించిందని గుర్తు చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలంటే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయడం ముందున్న ప్రధాన విధి అని, ప్రపంచంలో భారతదేశం నాణ్యమైన విత్తన ఉత్పత్తుదారుల్లో ముందున్నదన్నారు. ఇందులో తెలంగాణ మరింత ముందంజలో ఉందని చెప్పారు. కరోనా విపత్తు సమయంలో విత్తన ఉత్పత్తి రంగం, పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను దేశమంతటా అనుసరించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.
విత్తనరంగానికి ప్రోత్సహించే విధంగా తెలంగాణ నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఏర్పడే నాటికే నకిలీ విత్తనాల సమస్య సవాల్గా ఉండేదని, దీన్ని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ తొలిసారిగా పీడీ యాక్ట్ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నకిలీ విత్తన విక్రేతలపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. విత్తన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాబోయే తరాలకు విత్తన పరిశ్రమ ఉత్తమ ఫలితాలు అందాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి ఎస్కే పట్నాయక్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఐకార్ సీడ్స్ డీజీ డాక్టర్ డీకే యాదవ, తెలంగాణ సీడ్స్ ఎండీ కేశవులు, ఎన్ఎస్ఏఐ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, ఇస్టా వైస్ ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ అల్లెన్, జీఎఫ్ఏ జనరల్ ఏజెంట్ ఆఫ్ బెలట్రెల్ కో ఆపరేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ బీఎంఈఎల్ ఉల్రెక్ మిల్లర్, ఎస్ఎస్ఐఐ వైస్ ప్రెసిడెంట్ పరేశ్ వర్మ, కేంద్ర ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ కుమార్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.