వనపర్తి : ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను. ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వనపర్తిని రాష్ట్రంలోని అగ్రశ్రేణి నియోజకవర్గాల్లో ఒటిగా నిలబెట్టానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy )అన్నారు. శుక్రవారం వనపర్తి మున్సిపాలిటీలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలతో మంత్రి జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. నియోజవర్గానికి సాగునీరు, ఉన్నత విద్యాసంస్థలు తీసుకువచ్చాను. వైద్యరంగాన్ని గణనీయంగా మెరుగుపరిచి, ప్రతి గ్రామానికి, తండాకు రహదారులు తీసుకొచ్చానని తెలిపారు. నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుతో లోఓల్టేజీ వంటి కరంటు సమస్యలు లేకుండా చేశాను. సాగునీటి రాకతో వనపర్తి సస్యశ్యామలం అయిందన్నారు.
కాంగ్రెస్ పార్టీవి కోతలు.. బీఆర్ఎస్ పార్టీవి చేతలని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని, అభివృద్ది చేసిన పార్టీని ఆదరించండి .. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తానన్నారు.