వనపర్తి: అణచివేతపై తిరుగుబాటుచేసిన విప్లవవీరుడు సర్వాయి పాపన్న అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. గీతవృత్తిని నమ్ముకుని జీవిస్తూ సైనికుల ఆగడాలపై ఎదురుదాడి చేసిన ధీరుడన్నారు. సొంతంగా సైనిక బలగాన్ని ఏర్పరచుకుని జనగామ నుండి గోల్కొండ వరకు 20 కోటలను జయించాడని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అక్రమ శిస్తులను కొల్లగొట్టి పేదలకు పంచిన మానవతావాది సర్వాయి పాపన్న అని చెప్పారు.
తెలంగాణ చరిత్రలో సర్వాయి పాపన్నది ప్రత్యేక ప్రస్థానమని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా జరపడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు రూ.లక్ష 116 సాయం అందిస్తున్నామన్నారు.
ఒక్క కల్యాణలక్ష్మి పథకం కింద 12 లక్షల పైచిలుకు ఆడబిడ్డల పెళ్లిళ్లకు సాయం అందించామని, దాదాపు 14 లక్షల మందికి అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకం కింద సాయం చేశామన్నారు. 84 వేల మందికి రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు, ఏటా 65 లక్షల మందికి రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నామని చెప్పారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నదే సీఎం కేసీఆర్ విధానమని ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులకు మంత్రి నిరంజన్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.