వనపర్తి : కరువునేల వనపర్తిలో సాగునీటితో సస్యశ్యామలం చేశాను. వానలు కురవకపోయినా ప్రాజెక్టుల ద్వారా పంటలు పండే విధంగా సాగునీళ్లు తీసుకువచ్చానని, మిట్ట ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాలకు మినీ లిఫ్ట్ లను ఏర్పాటు చేసి రైతులకు చేదోడుగా నిలిచానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy )అన్నారు. బుధవారం వనపర్తి మండల పరిధిలోని అచ్చుతాపురం, రాజాపేట, ఖాసింనగర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ..సాగునీటి రాకతో నేడు ఎక్కడ చూసినా ధ్యానపు రాశులు కనిపిస్తున్నాయని తెలిపారు. నాలుగు నెలలుగా ఒక్క చుక్క వాన లేదు..15 చెక్ డ్యామ్ లు కట్టించి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చేసినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ ఏం చేయలేదని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు. మరి 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా రైతు బంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో చేసిన పనులు మీ కళ్ల ముందు ఉన్నాయి. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.