హైదరాబాద్ : సీఎం కేసీఆర్ను ఒప్పించి కిష్టగిరి గ్రామానికి సాగు నీరందిస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పల్లె నిద్రలో భాగంగా మంత్రి వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి, వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కింద మంజూరైన పథకాలు, పనులు, లబ్ధిదారుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిష్టగిరి అభివృద్ధికి నాది హామీ అన్నారు. సాగు, తాగునీటి అందిస్తానని హామీ ఇచ్చానన్నారు.
ఇందులో తాగునీళ్ల హామీని నెరవేర్చానన్నారు. సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, సవాయిగూడెం వరకు కాలువ వచ్చిందని, అక్కడి నుంచి రూ.18కోట్లతో సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి.. పనులు ప్రారంభిస్తామన్నారు. గ్రామానికి సీఎం ఆర్ఎఫ్ నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించామన్నారు. రైతుబంధు కింద రూ.1.89కోట్లకుపైగా అందించామని, బీమా కింద నాలుగు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు.
అమ్మ ఒడి పథకం కింద ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేల చెల్లించడంతో కేసీఆర్ కిట్ను 65 మంది లబ్ధిదారులకు అందించామన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలు అభివృద్ధి చేశామని, మిషన్ భగీరథ కింద గ్రామంలో 238 ఇండ్లకు రూ.25.77లక్షల ఖర్చుతో మంచినీరందిస్తున్నట్లు చెప్పారు. గొల్ల కుర్మలకు 24 గొర్రెల యూనిట్లు ఇచ్చినట్లు వివరించారు.