హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి రోజు ఎకరా లోపు ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల్లోపు ఉన్న వారికి, మూడో రోజు మూడు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతుబంధు నగదును జమ చేశారు. దీంతో రైతులు తమ ఖాతాల నుంచి నగదును విత్ డ్రా చేసుకుంటున్నారు. వ్యవసాయానికి పనులు చకచకా చేసుకుంటున్నారు.
రైతుబంధు పథకం కింద మూడో రోజు రూ. 1312.46 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ మూడు ఎకరాల్లోపు ఉన్న 10,78,634 మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మూడు రోజుల్లో 47,09,219 మంది రైతుల ఖాతాల్లో రూ. 3133.21 కోట్లు జమ చేశామన్నారు. వ్యవసాయానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి ఉద్ఘాటించారు. వ్యవసాయానికి చేయూతను అందించాలన్న ముందు చూపు కేంద్రంలో కొరవడిందని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రాష్ట్ర రైతులకు ఎందుకు రాదు? అని ప్రశ్నించారు.