హైదరాబాద్ : గత ఏడేండ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఇఫ్కో ప్రతినిధులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, జీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా మూలంగా వ్యవసాయం మీద రైతులకు నమ్మకం పెరిగిందన్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి పండుగ అనే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో రెండో స్థానానికి చేరింది. రైతుల ఆత్మహత్యలు తగ్గి ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్నారు.
పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయాలన్నారు. తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో సమావేశంలో చర్చించాలన్నారు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుతో దక్షిణ భారతదేశం మొత్తానికి అందుబాటులో ప్లాంటు ఉంటుంది అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.