Minister Niranjan Reddy | గద్వాల : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. బుధవారం జోగులాంబ జిల్లా కేంద్రంలోని సీఎన్జీ ఫంక్షన్ హాల్లో ఉత్సవాల నిర్వహణపై వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్ఫూర్తిని నింపడానికే దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.
ఉత్సాహంగా పనిచేయడానికి, అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్ఫూర్తి నింపడానికి ఎంతో ఉపయోగపడుతాయని వివరించారు. 21 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు ప్రజల మెదడులో బలంగా నాటుకుపోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పురోగతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వేడుకల్లో ప్రజలను ఎక్కువగా భాగస్వాములను చేయాలని కోరారు. మొదట రైతు దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా రైతు వేదికలను శుభ్రంగా ఉంచి మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేయాలని కోరారు.
వేదికల వద్దకు రైతులు ఎక్కువగా ఎడ్ల బండ్లపై రావడానికి ఆసక్తి చూపాలన్నారు. వనపర్తిలో తన కోడెలతో ఎడ్ల బండిపై తాను వస్తానని మంత్రి తెలిపారు. కలెక్టర్ కూడా ఎడ్ల బండిపై వస్తే మరింత స్ఫూర్తినిచ్చిన వారవుతామని చెప్పారు. వానకాలం సీజన్లో ఎక్కువగా పత్తి, కంది పంటలు సాగు చేసేలా రైతు దినోత్సవాన రైతులకు వివరించాలని సూచించారు. అయితే, ప్రతిపక్షాలకు చెందిన కొందరు అవగాహన లేని సన్నాసులు ఇంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వీరి మాటలను నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో 2,603 రైతు వేదికలు నిర్మించామని, అందులో 2,601 రైతువేదికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతు వేదికలను ప్రజావేదికలుగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి మంద జగన్నాథం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.