వనపర్తి : మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పాటునిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆటలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వనపర్తి మర్రికుంట గురుకుల పాఠశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల జోనల్ లెవెల్ క్రీడలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
పాఠాలతో పాటు పాఠశాలల్లో క్రీడలకు కొంత సమయం కేటాయించాలని నిరంజన్ రెడ్డి సూచించారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా వంటి దేశాల్లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని మంత్రి తెలిపారు. దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు సరైన వసతులు లేవన్నారు. ప్రోత్సాహం కూడా అందడం లేదన్నారు. దీంతో ప్రతిభావంతులైన విద్యార్థులు అంతర్జాతీయ వేదికలపై సరైన సత్తా ప్రదర్శించలేకపోతున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ , ప్రోత్సాహం అందిస్తున్నదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు.
దీని ఫలితాలు భవిష్యత్ లో కనిపిస్తాయన్నారు. తెలంగాణ విద్యార్థులు జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వీఎం అబ్రహం, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాం పాష తదితరులు పాల్గొన్నారు.