Minister Niranjan Reddy | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో చేనుచెలక పచ్చగా మారాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చలపర్తిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉండేవని.. తొమ్మిదేళ్లలో 74లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లె ప్రాంతంలో రైతు భూముల విలువ గణనీయంగా పెరిగాయన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాల గొప్పదనం అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్నదన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర నిధులతో రూ.10వేల నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు. రూ.65వేలకోట్లు రైతుబంధుకు రూ.5వేలకోట్లు రైతుబీమాకు అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఒక వ్యవసాయరంగంపైనే రూ.4.50లక్షలు కోట్లు, సాగునీటి రంగంపై రూ.1.59లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. మక్కల కొనుగోలు కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రం ఈ విధంగా ఖర్చు చేయలేదని, వ్యవసాయ యాంత్రికీకరణ కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం మారుమూల గ్రామానికి సైతం సాగు, తాగునీరు అందుతుందన్నారు.
వడగళ్ల వాన కారణంగా పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకునేందకు నర్సంపేట నియోజకవర్గానికి రూ.40కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు రూ.10వేల చొప్పున పరిహారం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. పండిన పంటకు సరిపడా గోదాములు ఉన్నాయన్నారు. తెలంగాణ రైతులకు అందుతున్న పథకాలు నేడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తడిసిన వడ్లను కూడా కొనాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.