వనపర్తి : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 81 వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ జరుగలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.
అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి నూతన జోనల్ వ్యవస్థకు ఆమోదం తీసుకువచ్చారన్నారు. దీంతో తొలిసారి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించనున్నాయని మంత్రి వివరించారు. నిరుద్యోగులు ప్రభుత్వ కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ సాధనలో విజయం సాధించాలని మంత్రి సూచించారు.