హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): రాజకీయంగా ఉనికి కోల్పోతున్నామనే అక్కసుతోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. నాడు కేసులు వేసినవారే ఇప్పుడు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద ఇప్పటికే భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులతో కలిపి 5.50 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు తాగునీటి అవసరాలు కూడా కలిపి ఆధారపడి ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే 216 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని తెలిపారు. విపక్షాలు మొదట జూరాల నుంచి మొదలుపెట్టాలని, ఆ తర్వాత అనేక కేసులు వేయడంతోపాటు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అన్ని సవాళ్లను అధిగమించి ఇప్పుడు ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలను ప్రారంభించగానే.. ఒక్క పంపుతో ఎలా మొదలు పెడతారంటూ విమర్శలకు దిగుతుండడం సిగ్గుచేటన్నారు. పాలమూరుకు నీళ్లు రావాలి, ప్రజలు, రైతులు, ప్రాంతం బాగుపడాలన్న దానికన్నా.. ప్రాజెక్టు విఫలం కావాలన్న ఆకాంక్షనే విపక్షాలకు ఎకువగా ఉన్నదని దుయ్యబట్టారు. ఆఖరికి సుదీర్ఘ అనుభవమున్న, తెలంగాణ గర్వించదగిన ఇంజినీరు పెంటారెడ్డిపై బురదజల్లడంపై మండిపడ్డారు. 60 ఏండ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిలదొకుకుంటున్నదని, పాలమూరుకు నీళ్లొస్తే తమ రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎకడ కూలిపోతాయోనని ఆందోళనతోనే విపక్ష నేతలు విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే పాలమూరు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.