హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆయనకు మాటలు తప్ప, పనులు చేతకాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోదీకి తెలంగాణ పదం ఉచ్చరించే అర్హతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరంజన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చారని ప్రశ్నించారు.
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన మోదీ
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశం అన్ని విధాలుగా దివాలా తీసిందని మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నిస్సిగ్గుగా తెగనమ్మి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మేకిన్ ఇండియా అని చెప్పి సేల్ ఇండియాగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేండ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పుచేసిన మోదీ మరో 8 లక్షల కోట్ల అప్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకొన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేదని స్పష్టం చేశారు. రూ.4 వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే ముహం చాటేసిన మోదీ, రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులను మాఫీ చేశారని మండిపడ్డారు.
బీజేపీదంతా కుటుంబపాలనేగా..
నరేంద్ర మోదీ మూడుసార్లు గుజరాత్ సీఎంగా, రెండుసార్లు దేశ ప్రధానిగా ఉండి సొంత రాష్ట్రం గుజరాత్లో 24 గంటల కరెంటు ఇవ్వలేకపోయారని నిరంజన్రెడ్డి విమర్శించారు. నిరంకుశత్వం, కుటుంబపాలన అనే మాటలు మోదీ నోటి నుంచి వినడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. కుటుంబ పాలన గురించి మాట్లాడేముందు అమిత్ షా కుమారుడు జైషాను బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.