న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నదాతల ప్రభుత్వం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఢిల్లీలో దీక్ష చేయడం మనకు సంతోషం కాదు. కానీ ఇలాంటి అనివార్య పరిస్థితులు కల్పించింది కేంద్రం అని మంత్రి మండిపడ్డారు. కేంద్ర మోసపూరిత వైఖరిని గ్రహించిన సీఎం కేసీఆర్ రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. వానాకాలం పంటను కొనే సమయంలోనే యాసంగి పంటను కొనమని బీజేపీ చెప్పింది. సీఎం కేసీఆర్, మంత్రుల బృందం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చి విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. ధాన్యం సేకరణపై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఉలుకు పలుకు లేదు. రకరకాల షరతులు విధించిన కేంద్రం.. రైతుల ఉసురు పోసుకుంటున్నది.
తెలంగాణ రైతులను అవమానించేలా కేంద్ర మంత్రి మాట్లాడిండు. కనీస మర్యాద లేకుండా మాట్లాడటం అత్యంత దుర్మార్గం. తెలంగాణ సమాజం కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించదు. తెలంగాణ రైతులు చెమటోడ్చి పంజాబ్ కంటే అధికంగా ధాన్యం పండించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రైతులు భారీ స్థాయిలో ధాన్యం పండించి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్రం పాత్ర లేదు. కేంద్రానికి రైతులు చెమటలు పట్టించే రోజులు వచ్చాయన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కేంద్రానికి చుక్కలు చూపించారు. అబద్ధాలతో బీజేపీ పరిపాలన కొనసాగిస్తోంది అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.