హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తున్న ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చిల్లర రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ‘మీరు ఎలాగూ రైతులకు సాయం చెయ్యరు.. చేసే వారిపైనా విమర్శలా?’ అని ప్రశ్నించారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని శనివారం ప్రకటనలో హితవు పలికారు.
వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ర్టాలకు చెందిన సుమారు 600 మంది రైతులు అమరులైనట్టు తెలిపారు. వీరి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు. వీరికి దేశం మొత్తం అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రైతుల పోరాట ఫలితంగానే మోదీ ప్రభుత్వం నల్ల సాగు చట్టాలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పిందన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న నల్లచట్టాలను బీజేపీ ప్రభుత్వం అమలుచేసిందని, అందుకే కాంగ్రెస్కు మొఖంలేక రైతుల వద్దకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. 16 నెలలు చలి, వాన, ఎండలో పోరాడి మరణించినవారి కుటుంబాలకు సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ను అభినందించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.
ఆ రైతులు ఇతర దేశాలవారైనట్టు కాంగ్రెస్, బీజేపీ విషం చిమ్మడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో ఏ కారణం చేతనైనా రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకొనేందుకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షల పరిహారం అందజేస్తున్నామని, ఇప్పటివరకు 80,755 రైతు కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. రైతుబీమా లాంటి పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ రాష్ర్టాల్లో అమలుచేసే దమ్ముందా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకొన్న రైతులకు రూ.50 వేల సాయం అందాలంటే ఎక్కని గడప, మొక్కని నాయకుడు ఉండేది కాదని ఎద్దేవా చేశారు. రైతుబీమా పరిహారం పొందిన రైతులందరివీ ఆత్మహత్యలని కాంగ్రెస్ ప్రచారం చేయటంపై మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో హడావుడి చేయడం కాదని, కాంగ్రెస్ రాష్ర్టాల్లో ఈ పథకాలను అమలు చేయాలని సవాల్ విసిరారు. అధికారం మీద ఆశతో కాంగ్రెస్, బీజేపీ పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. రైతుబీమా, రైతుబంధు ద్వారా 63 లక్షల మంది ఖాతాల్లో ఇప్పటిదాకా రూ.50,447.33 కోట్లు జమ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు.