Niranjan Reddy | నియోజకవర్గంలో సాగునీళ్లను తీసుకువచ్చి తీసుకువచ్చి బతుకుదెరువుకు బాటలు వేశానని.. తాను మాట్లాడే ప్రతిమాట.. చేసే ప్రతి పని రేపటి భవిష్యత్తు.. బతుకుదెరువు కోసమేనని మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం జగత్పల్లి, మణిగిల్ల, పెద్దమందడి, చిన్నమందడితో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి భవిష్యత్ మొత్తం వ్యవసాయరంగంపైనే ఆధారపడి ఉంటుందని, ముందుచూపుతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ తనను వ్యవసాయశాఖ మంత్రిని చేయడంతో కష్టపడి పని చేసి వ్యవసాయానికి వన్నె తెచ్చానన్నారు. వనపర్తి పేరును నిలబెట్టానన్నారు. సీఎం కేసీఆర్ 24గంటలు రైతులకు ఉచిత కరెంటును ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ప్రజలకు కరెంటు కష్టాలు మాత్రమే ఇచ్చారన్నారు. భవిష్యత్లో కాంగ్రెస్ వస్తే రాష్ట్ర పరిస్థితి, ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. తెల్ల రేషన్కార్డు ఉన్నవాళ్లందరికీ రైతుబీమా తరహాలోనే కేసీఆర్ బీమాను అమలు చేస్తామన్నారు.
సాగునీరు ఇవ్వడంతో రాష్టంలో 2.5 కోట్ల మందికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఉపాధి దొరుకుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 24వేల ఉద్యోగాలు ఇచ్చారని.. 9ఏళ్ల కాలంలో 1.62లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో 3.30 లక్షల మందికి కంప్యూటర్ ఉద్యోగాలు వస్తే.. బీఆర్ఎస్ హయాంలో 6.30 లక్షల కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చాయన్నారు. అందరి ఆశీస్సులతో గెలిచేది.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
ఎన్నికల సమయంలో రైతుబంధు వేస్తే కేసీఆర్కు ఓట్లుపడుతయ్ అని కాంగ్రెస్ లెటర్లు రాసి అడ్డుకుందని ఆరోపించారు. ఎన్నికలకు, రైతుబంధుకు సంబంధం లేదని, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం వివరణ ఇస్తే ఈసీ రైతుబంధు ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని, భవిష్యత్ను నిర్ణయించేవని సూచించారు. అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నిక అన్నారు.
సరైన నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి ముందుకు సాగేందుకు వీలుగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ 50ఏళ్ల పాలనను చూశామని.. రెండుసార్లు కేసీఆర్ పాలన చూశామని.. ఒకసారి కాంగ్రెస్ పాలన చూద్దామనుకుంటే ఐదేళ్లు చూసేందుకు ఏమీ ఉండదన్నారు. ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు, వసతులు గతంలో ఉండేవా ఆలోచించాలని.. రైతులు అప్పుల పాలుకావొద్దని ఆలోచించి రైతుబంధు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ మాత్రం రైతులు అప్పులపాలు కావాలని చూస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.