వనపర్తి : గత చరిత్ర తెలియకుంటే ప్రస్తుత తరాలకు నేటి చరిత్ర అర్థం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం విలువ ప్రస్తుత తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎన్ని పోరాటాలు జరిగాయి? ఎంత మంది త్యాగాలు చేశారు? అన్నది తెలియాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజుల పాటు 75 ఏండ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
వనపర్తి కలెక్టరేట్లో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి. స్వాతంత్ర్యం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పోరాటం చేశారు. ఈ నెల 21 వరకు గాంధీ సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తారు. విద్యార్థులందరికీ ఈ సినిమాను చూయించాలి. వంద గ్రంథాలకన్నా ఒక సినిమా చూస్తే పిల్లల మనసుల్లో బలమైన ముద్ర పడుతుందని నిరంజన్ రెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.