హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ ఆరోపణలు రుజువు చేయలేకపోతే రఘునందన్రావు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రఘునందన్రావు పేర్కొన్న మూడు వ్యవసాయ క్షేత్రాలపై ఆయనకు నచ్చినవాళ్లతో సర్వే చేయించుకోవచ్చునని, అక్కడ చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూమి కన్నా ఒక గుంట ఎకువ ఉన్నా ఆ భూములను తన పిల్లలు వదులుకుంటారని స్పష్టంచేశారు. రాజకీయ దుర్బుద్ధితోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిల్లలు వారి కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిపైనా ఆరోపణలు చేయడం దుర్మార్గమని అన్నారు. తన స్వగ్రామం పాన్గల్లో తనకు ఉన్న భూముల వివరాలను 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లోనే పేర్కొన్నానని, అవి ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కావని తెలిపారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇల్లు తన భార్య సొంత డబ్బులు, బ్యాంకు లోన్ తీసుకొని నిర్మించుకున్నామని పేర్కొన్నారు.
గౌడనాయక్ నా ఇంటి మనిషి
ఎస్టీల పేరుపై ఉన్న భూములను తన కుటుంబసభ్యుల పేరిట మార్చుకున్నారంటూ రఘునందన్రావు చేసిన ఆరోపణలపై నిరంజన్రెడ్డి మండిపడ్డారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు కూతుళ్లు చండూరులో భూములు కొనుగోలు చేశారని వివరించారు. కరోనా కారణంగా విదేశాల నుంచి రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరుపై కొంత భూమిని రిజిస్టర్ చేసి తర్వాత తమ పేరు మీదకు మార్చుకున్నారని వివరించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గౌడనాయక్ను చేరదీసి ఇంట్లో ఉంచుకుని, పెంచి పెద్ద చేసి, ఉన్నత చదువులు చదివించానని, ఆయన తన ఇంటి మనిషని తెలిపారు. ప్రస్తుతం తమ ఇంటి వ్యవహారాలు గౌడనాయక్ చూసుకుంటున్నాడని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా రఘునందన్రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.
ఆ భూమి నా మరదలు, వారి స్నేహితులది
రఘునందన్రావు చెప్తున్నట్టుగా పెద్దమందడి మండలం మోజర్లలో తనకు 50 ఎకరాల భూమి లేదని నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. లండన్లో డాక్టర్గా పనిచేస్తున్న తన మరదలు కవిత, ఆమె స్నేహితులు కలిసి వెల్టూరులో 11.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని వెల్లడించారు. వారు ఇక్కడ ఉండని కారణంగా ఆ భూములను తానే పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ భూమికి ప్రభుత్వం నుంచి ఎలాంటి రహదారి మంజూరు కాలేదని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటనను ఈ భూములకు ముడిపెట్టడం నీచపు ఆరోపణ అని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఘునందన్ క్షమాపణ చెప్పాలి
తాను 40 ఏండ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో ఏనాడూ అక్రమాలకు, తప్పుడు చర్యలకు పాల్పడలేదని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదని అన్నారు. 1985 నుంచే ఆదాయపు పన్ను చెల్లించిన న్యాయవాదినని, స్థాయిని మించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని రఘునందన్రావుకు సూచించారు. రఘునందన్రావు తనను తాను ఎకువ ఊహించుకుని ఆరోపణలు చేస్తే భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని హెచ్చరించారు. నిజానిజాలు తెలుసుకోకుండా రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రఘునందన్రావుపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు.