వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవించి, అందరిని ఆదరిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్రిస్మస్ విందుకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రతి క్రిస్టియన్ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. క్రిస్టియన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. క్రైస్తవులందరికీ మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. క్రిస్టియన్ కమిటీ భవనం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసి, మునిసిపాలిటీ నుండి ఏర్పాటు చేయటం జరుగుతుందని ఆమె తెలిపారు. గత సంవత్సరం కరోనా ఉన్నప్పటికీ ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన నిరుపేదలకు బతుకమ్మ చీరల పంపిణీ, ముస్లింలకు, క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం క్రిస్టియన్లకు వసతి గృహాలను ఏర్పాటు చేసిందన్నారు. జీసస్ ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని, ప్రేమ, కరుణ కలిగి ఉండాలని చెప్పటం జరిగిందని ఆమె తెలిపారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, చిన్నారులకు, భావితరాలకు మంచిని పెంచే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి, విందులో పాల్గొన్నారు.