హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: చిరుధాన్యాలకు మద్దతు ధర కల్పించడంతోపాటు మొత్తం పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే రైతులు చిరుధాన్యాల సాగుకు మొగ్గు చూపుతారని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో శుక్రవారం చిరుధాన్యాలపై హెచ్ఐసీసీలో నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న ప్రపంచ ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని దేశంలో పంటల సాగు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం చిరుధాన్యాల సాగును పెంచుతున్నదని, పప్పు, నూనెగింజల పంటలు సాగు చేసే దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని ఆరు జిల్లాలు, 36 మండలాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉన్నదని వెల్లడించారు.
2023 సంవత్సరాన్ని కేంద్రం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, వీటి సాగు విస్తీర్ణం పెరగాలంటే పరిశోధన సంస్థలు ఆ ధాన్యాల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉన్నదని మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పౌరసరఫరాలశాఖ ద్వారా బియ్యం, చకెర ఇస్తున్నట్టే చిరుధాన్యాలను కూడా పంపిణీ చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో రికార్డు స్థాయి పంటలను ఉత్పత్తి చేసిందని చెప్పారు. ఈ వానకాలంలో 1.45 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతోనే ఇది సాధ్యమైందన్నారు. అనంతరం ‘మిల్లెట్స్ ద ఫ్యూచర్ ఫుడ్’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ సీఈవో ఆశోక్ దాల్వాయి, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభా ఠాకూర్, ఐకార్ అడిషనల్ డీజీ డాక్టర్ ఆర్కే సింగ్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రత్నావతి, ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ సీఈవో డాక్టర్ దయాకర్ రావు, సమున్నతి సంస్థ అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.