మేడ్చల్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సారధ్యంలో తెలంగాణ మోడల్గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుందున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్ ఐపాస్ కింద 4089 పరిశ్రమలు ఏర్పడి రూ. 10 వేల 169 కోట్ల పెట్టుబడులు(Investments) వచ్చాయని పేర్కొన్నారు. దీనివల్ల లక్ష 80 వేల మందికి ఉపాధి(Employment) లభించిందన్నారు.
ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి సాధించిందని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందించడంతో రైతులలో ధీమా పెరిగిందన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా 118 బస్తీ దవాఖానలు మంజూరు చేయగా 94 బస్తీ దవాఖానలను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో లక్షా 48 వేల మందికి ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
మన ఊరు-మన బడి
మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధికి మొదటి దశలో రూ. 72 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వివరించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో 61 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెరుగైన ప్రజా జీవనానికి పోటీపడుతున్నాయని అన్నారు. కీసర చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త, పోలీసు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సెల్ఫ్హెల్ప్ మహిళ సంఘాల గ్రూప్లకు చెక్కులు
సెల్ఫ్హెల్ప్ మహిళ సంఘాల గ్రూప్లకు ప్రభుత్వం రూ. 18 కోట్ల 35 లక్షల చెక్కును డీఆర్డీఎ అధికారిణీ పద్మజారాణికి అందించారు. మెప్మా అధికారులకు రూ. 16 కోట్లు చెక్కులను మంత్రి అందజేశారు. విధులల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి మంత్రి మల్లారెడ్డి ప్రశంసా పత్రాలతో పాటు అవార్డులను అందజేశారు. 25 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్కుమార్, పోలీస్ కమిషనర్ స్టీవెన్ రవీంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీపీ సందీప్, ఆర్డీవోలు రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.