హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/కీసర: పర్యావరణహితమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణతోపాటు ఎకో టూరిజం పార్కులో జమ్మి మొ క్కలను నాటారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మిచెట్టు.. గుడి గుడికో జమ్మిచెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. కీసరగుట్ట ఎకో టూరిజం పార్కు పనులు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్కుమార్ కీసరగుట్ట ప్రాంతాన్ని దత్తత తీసుకొని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం సంతోషకరమని చెప్పారు. మరో సంవత్సరంలో కీసరగుట్ట అటవీ ప్రాంతమంతా హరితవనంగా మారుతుందన్నారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. వీరిని వేదపండితులు ఆశీర్వదించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్రావు, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, కీసర సర్పంచ్ మాధురి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.