వరంగల్ : భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్మవారిని మొక్కుకున్నానని ఆయన చెప్పారు. వరంగల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక మాసోత్సవ సదస్సులో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. దొంగలు దేశాన్ని దోచుకుని విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. దేశంలో మాత్రం పేదలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదని తేల్చిచెప్పారు. విజయ దశమి తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు.
దళిత బంధు అమలు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలకు మల్లారెడ్డి సవాల్ చేశారు. ఒక వేళ ఆ పథకాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.