మే డేను పురస్కరించుకొని తెలంగాణలోని కార్మికులందరికీ ఆ శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రవీంద్ర భారతిలో ఆదివారం (01-05-2022) నిర్వహించనున్న మే డే ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. మే డే ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సర్కారు.. కార్మికులకు శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులు ప్రధానం చేయనున్నదని వెల్లడించారు.
కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా మే డే ఉత్సవాలు జరుపుకోలేదని, ఈసారి ద్విగుణీకృత ఉత్సాహంతో నిర్వహిస్తామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కార్మికులు, యాజమాన్యాలు, ఇతర ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.